హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో బీసీలకు ప్రతిఏటా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా ఆక్షేపించాయి. కేటాయించిన అత్తెసరు నిధులను సైతం ఖర్చు చేయడం లేదని మండిపడ్డాయి. ఈ మేరకు ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్ శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్లో బీసీలకు జరిగే అన్యాయాన్ని ఇకపై సహించేదిలేదని తేల్చిచెప్పాయి.
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ప్లాన్ కింద ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో లక్ష కోట్లను వెచ్చిస్తామని హామీ ఇచ్చిందని, గత రెండేండ్లలో కేవలం రూ.5వేల కోట్లే కేటాయించిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీని అమలుచేయడంతోపాటు రాబోయే బడ్జెట్లో బీసీలకు రూ.50వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనన్నట్టు వెల్లడించారు. దీక్షకు బీసీ మేధావులు, సంఘాల నేతలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.