నాంపల్లి కోర్టులు, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 16వ నిందితుడైన సాన ప్రశాంత్రెడ్డి అలియాస్ ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలన్న సిట్ విన్నపాన్ని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య తిరస్కరించడంతో నిందితుడి బెయిల్ పిటిషన్పై ఆయన తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
న్యూజిలాండ్లో ఉంటున్న ప్రశాంత్రెడ్డి తన కుమార్తె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో భారత్కు వచ్చాడని, ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై సిట్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రశాంత్ వద్ద గ్రూప్-1 ప్రశ్నపత్రం ఉన్నదని, దాన్ని ఇతరులకు అందించేందుకు జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్.. తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. బెయిల్ కోసం ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.