హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. 82గంటల 47 నిమిషాలపాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో మూడు తీర్మానాలు చేయగా.. పది బిల్లులకు ఆమోదం తెలిపారు, ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు.
రాష్ట్రంలో మంత్రులంతా గాలిమోటర్లలో గాలి తిరుగుడు తిరుగుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఏలేటి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో కాసేపు దుమారం చెలరేగగా.. స్పీకర్ సూచన మేరకు ఏలేటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో వివాదానికి తెరపడింది.
ప్లాట్ఫాం ఆధారిత గిగ్వర్కర్ల బిల్లు-2026, న్యాయవాదుల రక్షణ బిల్లు-2026లకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. అదేవిధంగా శాసనమండలిలో సోమవారం పలు బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు, తెలంగాణ వైద్య విధానపరిషత్ రద్దు బిల్లు, గిగ్ వర్కర్స్ బిల్లు, తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.
వేసవిలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని, ఫలితంగా నల్లగొండ జిల్లా సంస్థాన్నారాయణపురం మండలంలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆందోళన వ్యక్తంచేశారు. మండలిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎండిపోతున్న పంటలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.