వేములవాడ : రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ(Vemulawada) రాజన్న ఆలయ(Rajanna temple) ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.119 కోట్ల 72లక్షల 80వేల 241 నికర ఆదాయం సమకూరినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ యేడు మేడారం సమ్మక-సారక జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి తాకిడి పెరిగి ఎక్కువ మొత్తంలో ఆదాయం(Annual income) సమకూరినట్లు చెప్పారు.
ఈ ఆదాయంలో సింహభాగం రూ.32.74 కోట్లు హుండీ ద్వారా లభించగా, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.21.81కోట్లు, కోడె టికెట్ల విక్రయం ద్వారా రూ.22కోట్లు, లీజులు, లైసెన్స్ల ద్వారా రూ.15.50 కోట్లు, వడ్డీల ద్వారా రూ.5.55 కోట్లు, ధర్మశాలల ద్వారా రూ.4.36కోట్లు, కల్యాణం టికెట్ల ద్వారా రూ.3.55 కోట్లు, అభిషేకం టికెట్ల విక్రయం ద్వారా రూ.2.79 కోట్లు, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా రూ.2.37 కోట్లు, కేశఖండనం టికెట్ల ద్వారా రూ.2.13 కోట్ల ఆదాయం వచ్చింది.
అలాగే ఇతరత్రా వాటి ద్వారా రూ.6.92 కోట్ల ఆదాయం లభించింది. ఇక గత సమ్మక్క సారక్క జాతర(2021-22) టైంలో ఆలయానికి రూ.87.78కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.31.94కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరంలో నికర ఆదాయం రూ.100కోట్ల దాటడమే కాకుండా రికార్డు స్థాయిలో సమకూరినట్లు ఆధికారులు వెల్లడించారు.