హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎజెండాకరువయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అంశంపై పోరాటం చేయాలో స్పష్టత కొరవడింది. వామపక్షాలతోపాటు మరికొన్ని చిన్నాచితక పార్టీలను గాంధీభవన్కు ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఖరారుచేయడంలో తెల్లమొహం వేసింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర పేరిట ఇటీవల నిర్వహించిన సభల్లో ప్రస్తావించిన అంశాలను అఖిలపక్ష భేటీలో చర్చించలేదని సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ప్రవేశపెట్టారంటూ పరోక్షంగా దళితబంధు పథకాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరా అఖిలపక్షంలో దీనిపై నోరెత్తలేకపోయింది. హుజూరాబాద్తోపాటు ఆలేరు, మధిర, తుంగతుర్తి, జుక్కల్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రయోగాత్మకంగా అమలుచేస్తుండటాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. దళితవర్గాలతోపాటు సామాజిక ఉద్యమకారులు విప్లవాత్మక పథకంగా కీర్తిస్తున్న నేపథ్యంలో దళితబంధు జోలికెళ్తే.. ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న జంకుతోనే పీసీసీతోపాటు ఇతర పార్టీలు దీనిపై చర్చించలేదని భావిస్తున్నారు. దళితబంధును మినహాయించి, ఏ అంశంపై పోరాటాలు చేస్తే బాగుంటుందో సూచించాలని ఇతర పార్టీల అభిప్రాయాలను కోరడం కాంగ్రెస్ అయోమయానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పోరాట ఎజెండాను ఖరారుచేసే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తున్నది. దళిత, గిరిజన ఆత్మగౌరవ అంశాన్ని పక్కనబెట్టి, నిరుద్యోగంపై ఆందోళనలు చేయాలని పీసీసీ ప్రతిపాదించగా, పోడుభూములపై ఆందోళనలు చేయాలని సీపీఎం ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని ఇతర పార్టీలు సూచించాయి. ఎవరికివారు తమ సొంత ఎజెండాలపై పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నదానిపై కూడా సమావేశానికి స్పష్టత రాలేదు. ఈ పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తే ఉపయోగంలేదని వామపక్ష నేతలు సమావేశానంతరం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, షర్మిల వెనుక బీజేపీ ఉన్నందునే ఆ పార్టీలను ఆహ్వానించలేదని అఖిలపక్ష నేతలకు పీసీసీవర్గాలు వివరించినట్టు సమాచారం.