హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు అందరూ ఓటు వేసేలా చేయడమే తమ లక్ష్యమని, ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. శుక్రవారం సీఈవో కార్యాలయంలో ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ దివ్యాంగుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి దివ్యాంగుడు ఓటు వేసేలా ఇప్పటికే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీనికి కొనసాగింపుగా మరికొన్ని మార్పులతో కొత్త అప్లికేషన్ను ఆవిష్కరించినట్టు చెప్పారు. ఇందులో వారి పేర్లను చెక్ చేసుకోవడం, నమోదు చేసుకోవడం, ఫొటో సరిచేసుకోవడం, చిరునామా మార్పు ఇలా అన్ని అంశాలను వాయిస్ రూపంలో వినిపిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉపఎన్నికలో దివ్యాంగులు ఓటు వేసేలా ప్రేరణ ఇచ్చిన రాష్ట్ర పీడబ్ల్యూడీ ఐకాన్స్ బీ సుజాత (యాంకర్), ప్రముఖ క్రికెటర్ మహేంద్ర వైష్ణవ్ను సీఈవో సత్కరించారు.