హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): మాజీ ఐఏఎస్ అధికారి రజత్కుమార్పై ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను తొలగించేలా, ఆ పోస్టులు పెట్టినవారిని బ్లాక్ చేసేలా యూట్యూబ్, గూగుల్పై చర్యలు చేపట్టాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రజత్కుమార్ నిరుడు డిసెంబర్ 17 నుంచి 21 వరకు హైదరాబాద్లో తన కుమార్తె పెండ్లి వేడుక జరిపారు.
అందులో భాగంగా నిర్వహించిన ఈవెంట్లు, డిన్నర్లు, అతిథుల బసకు హోటల్ రూముల ఏర్పాట్లన్నీ మేఘా కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని ‘న్యూస్ మినిట్’ ప్రచురించడంతో దీనిపై కొందరు యూట్యూబ్, గూగుల్లో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ పోస్టులు పెట్టారని రజత్కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. రజత్కుమార్ పరువుకు నష్టం కలిగించేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.