హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ఫిట్నెస్ ఆలస్య రుసుము పేరుతో కేంద్రప్రభుత్వం డ్రైవర్ల ఉసురు పోసుకొంటున్నదని ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ విమర్శించింది. వాహనాల ఫిట్నెస్ ఆలస్య రుసుము రోజుకు రూ.50 వసూలు చేయడాన్ని వెంటనే రద్దుచేయాలని, లేదంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది. రుసుము వసూలును నిరసిస్తూ తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ నాయకులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు వేముల మారయ్య, సలావుద్దీన్, సూర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం జారీచేసిన 714 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి మోటరు వాహన కార్మికుల కష్టాలు కనిపించటంలేదా అని ప్రశ్నించారు. పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన చేస్తున్నా కిషన్రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. కేంద్రం తీరుతో 15 లక్షల మంది డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ ప్రభుత్వం రెండు త్రైమాసికాల మోటర్ వాహన పన్నును రద్దు చేసి మానవత్వం చాటుకొంటే.. ఆ రోజులకు కూడా ఫిట్నెస్ జరిమానా వేసి ప్రధాని మోదీ నియంత ధోరణిని బయటపెట్టుకొన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బంద్లో భాగంగా నగరంలోని ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం వద్ద టీఆర్ఎస్కేవీ నిరసన వ్యక్తంచేసింది. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, జీయూటీఎస్, టీఎస్టీడీజేఏసీ, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు బంద్లో పాల్గొన్నాయి.