ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 9: సాహిత్యంతోనే సమాజ అస్తిత్వం ముడిపడి ఉన్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. విశ్వజనీన అంశాలపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. సమాజ విచ్ఛిన్నానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో రెండో తెలుగు సాహిత్య మహాసభ సోమవారం ప్రారంభమైంది. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేశపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం లేకపోతే మనిషి మానవీయ గుణాల నుంచి దూరమవుతాడని చెప్పారు.
చరిత్ర, సామాజికశాస్ర్తాలు స్థల, కాలాలను రికార్డు చేస్తాయి కానీ అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమేనని తెలిపారు. సాహిత్యం చాలా పవర్ఫుల్ అని, అందెశ్రీ, గద్దర్ వంటి వారిని గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వారి సాహిత్యమే ఉపయోగపడిందని అన్నారు. సమాజ మూలాలను కనుగొంటూ మహాసభ కొత్త దృష్టికి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అన్ని రకాల సాహిత్యాలను చదవాలని సూచించారు. గత కాలపు సాహిత్య పరిణామాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ తెలుగు కేవలం సంభాషణ భాష మాత్రమే కాదని, సంస్కృతి, జీవనశైలి అని అన్నారు. సాంకేతికతను వినియోగించి, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయవచ్చని చెప్పారు.
సినిమాలు, జానపదాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహాసభ డైరెక్టర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతకింది కాసిం మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ జరిగినట్టే తెలుగు లిటరరీ కాంగ్రెస్ కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ప్రారంభించామని చెప్పారు. డిగ్రీ విద్యార్థులకు తెలుగు సిలబస్ను మూడు సంవత్సరాలు పెట్టాలని, అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొపెసర్ వెల్దండ నిత్యానందరావు మాట్లాడుతూ అతి నాగరికతతోపాటు నేటి వైజ్ఞానికత దేశాన్ని ధ్వంసం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నేటి సమాజంలో తరాల మధ్య అంతరాలు కొనసాగుతూ సంఘర్షణ వాతావరణం ఉన్నదని అన్నారు. వంటింటి ఆహారంతోనే ఆరోగ్యం, అది లేకపోతే అనారోగ్యమని చెప్పారు. నేటి తరం పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పాలని, ఏకాంతం నుంచి బయటపడేందుకు వాట్సాప్ లాంటి సాధనాలు ఉపయోగిస్తున్నారని, కానీ మానవ సంబంధాలను పెంచుకోవడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.