BJPLP | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2024-25 బడ్జెట్ సమావేశాలు మొదలైనా బీజేపీలో ఎల్పీ పీఠం ఎవరిదో ఇంకా తేలలేదు. ఈ కారణంగానే గురువారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ హాజరు కాలేకపోయింది. ఎల్పీ పీఠంపై సీనియర్ నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ఏదో ఒక నిర్ణయం తీసుకొని లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త పంచాయితీ తలకెత్తుకోవడం ఎందుకనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలిసింది.
గురువారం బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకుంటారని భావించారు. ఎన్నుకోకపోవడంతో బీఏసీ సమావేశానికి బీజేపీ ప్రతినిధిగా మహేశ్వర్రెడ్డి వెళ్లాలని పార్టీ సూచించింది. నిబంధనల ప్రకారం బీఏసీలో పాల్గొనాలంటే పార్టీ అనుమతి పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మహేశ్వర్రెడ్డి పార్టీ లేఖ తీసుకొని వెళ్లేసరికే బీఏసీ మొదలైపోయింది. మధ్యలో సమావేశంలోకి వెళ్లడం భావ్యం కాదనే ఉద్దేశంతో ఆయన వెనక్కు తిరిగి వచ్చేశారు. రాజాసింగ్ను ఒప్పించి ఎల్పీ పదవిని మహేశ్వర్రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.