వరంగల్ : వెలమలు రాశిలో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాసిలో గొప్పగా ఉన్నారు. ఇందుకు కారణం వెలమలు సమాజంలోని అందరిని కలుపుకుని పోవడమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం 27వ వార్షిక సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంఘం అధ్యక్షుడు పేరాల మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. విలువలకు కట్టుబడి నీతి, నియమాలు పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నందునే అనేక మంది రాజకీయ రంగాల్లో రాణించారని మంత్రి చెప్పారు. యతిరాజారావు, వెంకటేశ్వర రావు, రాజేశ్వర్ రావు, ధర్మారావు వంటి అనేక మంది మంచి పేరు తెచ్చుకున్నారు అన్నారు. తను కూడా అన్ని వర్గాలను కలుపుకు పోతూ అపజయం లేకుండా విజయం సాధించానని మంత్రి తెలిపారు.
ఇక సమాజంలో వెలమలకు ఉన్నత కులంగా పేరు ఉన్నప్పటికి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. వారిని అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేశ్వర్ రావు, ధర్మారావు, సంఘం ప్రధాన కార్యదర్శి బొంపల్లి వెంకట్ రావు, సంయుక్త కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్యామ్ సుందర్ రావు, కోశాధికారులు కాకుల మర్రి ప్రవీణ్ కుమార్, పల్లిపాటి విద్యాసాగర్ రావు, గండ్ర సత్యనారాయణరావు, తదితరులు ఉన్నారు.