హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే చేపట్టిన డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకాలను తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఆర్టీసీలో కొత్తగా 3,038 నియామకాలు చేపడతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో కేవలం 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. గత అక్టోబర్లో నోటిఫికేషన్ వెలువడిన ఈ పోస్టులకు దాదాపు 55 వేల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ, ఆ నియామకాలు పూర్తిచేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది.
ఈ నియామకాలు చేపట్టాల్సిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిసింది. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై గత 6 నెలల నుంచి ఆర్టీసీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రవాణా శాఖ మంత్రి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్ల కోసం డ్రైవర్లు కావాలని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నాయి. దీని వల్ల ఉపాధి కోల్పోయే ఆర్టీసీ డ్రైవర్లను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల్లో వినియోగించుకోవడంపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టడం లేదు. కొత్త డ్రైవర్ల నియామకానికి కూడా సుముఖత చూపడం లేదు. వీటితోపాటు ట్రాఫిక్, మెకానిక్, ట్రాఫిక్ మేనేజర్, సెక్షన్, అకౌంట్స్ ఆఫీసర్ల నియామకాలు కూడా ఆగిపోతున్నాయి. ఆర్టీసీలో ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు రిటైర్ అవడం, వారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారినే అర్హతల ఆధారంగా ఆ పోస్టుల్లో నియమించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే కొత్త నియామకాలు చేపట్టడం లేదని తెలుస్తున్నది.