Kothagudem | టేకులపల్లి, అక్టోబర్ 8: భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె బంధువులే కారణమని భావించిన భర్త వారి ఇంటెదుట మావోయిస్టుల పేరుతో నకిలీ కరపత్రాలు వదిలాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఆదివారం వెలుగు చూసింది. తేజావత్ జంపన్న, ఆయన భార్యది టేకులపల్లి గ్రామం.
వారిద్దరి మధ్య గొడవల కారణంగా ఇటీవలే జంపన్న భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రావడం లేదు. దీనికి భార్య తరఫు బంధువులైన మంగ్యా, తిరుపతి, గణేశ్ కారకులని భావించాడు. దీంతో శనివారం అర్ధరాత్రి వారి ఇంటి ఎదుట మావోయిస్టు నకిలీ కరపత్రాలను వదిలాడు. ‘జంపన్న భార్యను కాపురానికి పంపండి.. లేకపోతే చంపేస్తాం..’ అని దానిలో రాసి ఉంది. జంపన్నే ఈ పని చేసి ఉంటాడని భావించి వారు టేకులపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గన్రెడ్డి రమణారెడ్డి తెలిపారు.