రాజన్నసిరిసిల్ల, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): వేములవాడ పురపాలక సంఘంలో చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంలో భాగంగా కాంగ్రెస్లో అంతర్గతంగా ముసలం మొదలైనట్టు సమాచారం. ఈ మున్సిపాలిటీలో శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ నుంచి 13 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఈ పురపాలక పీఠం బీసీ జనరల్ కావడంతో కాంగ్రెస్లోని పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే చైర్మన్ పదవి దక్కాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగా చేరిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి మాత్రమే చైర్మన్ పదవి దక్కాలనే నినాదం ప్రస్తుతం కాంగ్రెస్లో ముసలానికి దారితీసింది. ఇటీవల పార్టీలో చేరి, 15వ వార్డు నుంచి గెలిచిన పులం రాజు వైపు విప్ ఆది మొగ్గు చూపుతుండగా, మొదటి నుంచి వెంట నడిచిన తూమ్ మధు కూడా తనకు చైర్మన్ పదవి కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. కొక్కుల రాజు, ఇప్పపూల మమత కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టుగా జోరుగా చర్చ జరుగుతున్నది.
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కాలంటే 15 స్థానాల్లో గెలువాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ 13 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రస్తుతం మరో రెండు స్థానాలు అవసరం కాగా, ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులతో పెద్ద ఎత్తున బేరసారాలకు దిగినట్టుగా సమాచారం. మరోవైపు వైస్ చైర్మన్ ఇస్తామంటూ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన 21వ వార్డు కౌన్సిలర్ నరాల శేఖర్కు విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పారు. విప్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ రాజ్యాంగ పరిధిలో నడుచుకోవాల్సి ఉండగా, వేములవాడలో అధికారం కోసం అక్రమాలకు తెర లేపారని ధ్వజమెత్తారు.