అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘థాయ్ ట్రేడ్ ఎక్స్పో’కు తొలిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికైంది. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 2(శుక్రవారం)న మొట్టమొదటిసారిగా “థాయ్ ట్రేడ్ ఎక్స్పో 2022’ని థాయ్ ట్రేడ్ సెంటర్, చెన్నై లాంఛనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం, థాయ్లాండ్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాన్ని సృష్టించడం ఈ ఈవెంట్ ప్రధాన లక్ష్యం. ఈ ఎక్స్పో థాయ్ వర్తక భాగస్వాములతో హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల మధ్య వాణిజ్య సంబంధాన్ని నెలకొల్పడం, అభివృద్ధి చేయడమనే రాయల్ థాయ్ ప్రభుత్వంలోని ఉప ప్రధాన మంత్రి, వాణిజ్య మంత్రి జురిన్ లక్సనావిసిట్ విజన్ను గుర్తుచేస్తున్నది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య, థాయ్ కాన్సుల్ జనరల్ నిటిరూగే ఫొనెప్రసెర్ట్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇండియా, థాయ్లాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు చానెల్లను రూపొందించేలా ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణ ప్రభుత్వం, థాయ్లాండ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అనుగుణంగా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో వివిధ థాయ్ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అలాగే, థాయ్ కంపెనీలు, హైదరాబాద్ వ్యాపార సంఘం మధ్య ఆన్లైన్ బిజినెస్ మ్యాచింగ్పై ఈ ఈవెంట్ దృష్టి సారిస్తుంది. అలాగే, ఈ మూడు రోజుల్లో ఎక్స్పోలో ముయే థాయ్ బాక్సింగ్ షో, ప్రామాణికమైన థాయ్ వంటకాలతో లైవ్ కుకింగ్ షో నిర్వహిస్తారు. ఇక్కడ హైదరాబాద్ ప్రజలు థాయిలాండ్ వంటలను రుచి చూడొచ్చు. థాయ్లాండ్ సంస్కృతిని తెలుసుకోవచ్చు.