హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) పరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పరీక్ష కీతోపాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్సైట్ https:// www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. గురువారం నుంచి ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాటిని ఆన్లైన్లో ఉంచనున్నట్టు తెలిపింది ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నాపత్రంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే సోమవారం (జూన్ 17) వరకు అక్కడే ఇచ్చిన టెక్ట్స్ బాక్స్లో ఇంగ్లిష్లో తెలపవచ్చని పేర్కొంది. వాటికి సంబంధించిన ఆధారాలను అప్లోడ్ చేయాలని సూచించింది.
ఈ మెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని వెల్లడించింది. అలాగే నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
ఇక గ్రూప్-1 మెయిన్ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో అర్హత పరీక్షగా జనరల్ ఇంగ్లిష్ పేపర్ను నిర్ణయించారు. గ్రూప్-1 మెయిన్లో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి. గ్రూప్-1 ప్రిలిమిరీలో ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా మెయిన్కు హాజరు కావడం తప్పనిసరి. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు ముందుగా ఎంపిక చేసుకున్న భాషలోనే జవాబులు రాయాలి. ఒక పేపర్ తెలుగులో, మరో పేపర్ ఇంగ్లిష్ లేదా ఉర్దూలో రాసిన జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఈ పరీక్షలను ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలి.