హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం టీజీవో, టీఎన్జీవో నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను సహించేది లేదంటూ నగరంలోని కార్యాలయ భవనాల ఎదుట పెద్ద ఎత్తున నినదించారు. దాదాపు 60 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామని, రాష్ట్ర ఏర్పాటును కించపరిచినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, వెంటనే ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీజీవో అధ్యక్షురాలు, టీఈజేఏసీ సెక్రెటరీ జనరల్ మమత డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగులంతా నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యమించామని, అలాగే నేడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 30శాతం పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటే.. ఆదాయపన్ను పరిమితిని పెంచకుండా కేంద్రం ఉద్యోగులపై వివక్ష చూపుతుందని, తక్షణమే ఆదాయ పన్ను పరిమితిని 10లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ప్రతాప్, టీజీవో, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణాయాదవ్, ముజిబ్, సుజాత, సబిత, సాయిపూర్ణచందర్రావు, సులోన, లక్ష్మీపతిరెడ్డి, డీ బాలకుమార్, ప్రవీణ్ కుమార్, డీ వినయ్ కుమార్, ఎన్ వినోద్ కుమార్, రెడ్డప్పా, ఆనంద్, కిశోర్, ఏ ఆనంద్ కుమార్, ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు.