హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెలలోనే జరుగనున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదివారం హైదరాబాద్లోని టీజీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికి ఐటీఐ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎం మోహన్నారాయణను ఎన్నికల అధికారిగా, రిటైర్డ్ ఎంపీడీవో యాదయ్యగౌడ్ను అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా నియమించింది. టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధానకార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ మాట్లాడుతూ… సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తీర్మానించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేసేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు వీ శ్రీనివాస్గౌడ్పై, టీజీవో సంఘంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. టీజీవో లోగోను అక్రమంగా వాడుతూ సంఘం ప్రతిష్ఠను దిగజార్చేలా చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నేతలు ఎంబీ కృష్ణాయాదవ్, సహదేవ్, గండూరి సత్యనారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.