హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) పిలుపునిచ్చింది. ఆదివారం టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బీ శ్యామ్ మాట్లాడుతూ.. లక్ష మంది ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని కోరారు.
ఆగస్టు 27న ఇందిరాపార్క్లో ధర్నా నిర్వహించినా సర్కార్లో ఎలాంటి కదలికలేకపోవడంతోనే చలో హైదరాబాద్ తలపెట్టామని తెలిపారు. పెండింగ్ బిల్లులు నెలకు వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నా సరిపోవడంలేదని, పెన్షన్లకు వెయ్యి.. రెగ్యులర్ ఉద్యోగులకు వెయ్యి కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, కోశాధికారి సహదేవ్, ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, రామకృష్ణాగౌడ్, నరహరిరావు, మల్లేశం, హరికృష్ణ, దీపారెడ్డి, శ్రీరాంరెడ్డి, శిరీష, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.