హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)లో ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న కీలక అధికారిపై బదిలీ వేటుపడింది. ఈ క్రమంలో ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా బదిలీ చేసింది. టీజీఎంఎస్ఐడీసీ అధికారులు మాత్రం సదరు అధికారి కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లినట్టు చెబుతుండటం గమనార్హం. ఇక ఆయన స్థానంలో ఫైనాన్స్ ఆఫీసర్గా ఉన్న వెంకటేశ్వర్లను ఇన్చార్జిగా నియమించారు.
కాగా, టీజీఎంఎస్ఐడీసీలో అక్రమాలపై ఏప్రిల్ 28న ‘నమస్తే తెలంగాణ’లో వెలువడిన ‘మందు గోళీ.. వాటాల కేళి..!’ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం మందుగోళీల్లో అవినీతి జరుగలేదని అధికారులు కప్పిపుచ్చుకునేందుకు యత్నించగా.. ఆధారాలతో సహా మే 6న ‘మందు గోళీల్లో అక్రమాలు నిజమే..!’ పేరిట మరో కథనాన్ని ప్రచురించింది. అయితే ఏప్రిల్ 28న ప్రచురితమైన కథనం తర్వాత రెండు రోజులకే హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి దవాఖానలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ (సీఎంఎస్)లో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం మే 20న విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. టెండర్లలో గోల్మాల్, నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్న కీలక అధికారి సహా ఇతర అధికారులపై విచారణ చేపడుతున్నట్టు విజిలెన్స్ తన లేఖలో వెల్లడించింది. తాజాగా టీజీఎంఎస్ఐడీసీ కీలక అధికారి బదిలీ కాగా, మందులు కొనుగోలులో అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. మంగళవారం సైతం విజిలెన్స్ అధికారులు టీజీఎంఎస్ఐడీసీ అధికారుల నుంచి కీలక సమాచారాన్ని తెప్పించుకున్నట్టు తెలిసింది.