Ponnam Prabhakar | తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి నూతన పాలసీని తీసుకువచ్చింది. ఈ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కొత్తగా తీసుకువస్తున్న ఈవీ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్లో రావొద్దనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100శాతం పన్ను మినహాయింపు ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు సైతం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని పొన్నం వివరించారు.