TS TET | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్’ తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా పలు సబ్జెక్టులను అభ్యర్థులు అదనంగా చదవాల్సి వస్తుంది.
ఇవి భారంగా పరిణమించగా.. వీటిపై అవగాహన లేక అనేక మంది అభ్యర్థులు టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. ఉపాధ్యాయ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ప్రత్యేకించి బీఎడ్ భాషాశిక్షణను పూర్తిచేసిన వారికి ఈ విధానంతో పూడ్చలేని అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి ఏపీ తరహాలో టెట్లో ప్రత్యేకంగా పేపర్ -2ఏ ను నిర్వహించాలని అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
అసంబద్ధ విధానం..
బీఎడ్ పూర్తిచేసిన వారికి నిర్వహించే టెట్ పేపర్ -2లో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, రెండో విభాగంలో మొదటిభాష, మూడో విభాగంలో ఇంగ్లిష్ ప్రశ్నలిస్తారు. ఇవి అందరికి కామన్గా ఉంటాయి. ఇక కీలకమైన నాలుగో విభాగంలో గణితం, సైన్స్లకు కలిపి ఒక పేపర్, సోషల్ స్టడీస్కు ఒక పేపర్కు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధానంతో బీఎడ్ను తెలుగుతో పూర్తిచేసిన వారు గణితం, ఫిజికల్సైన్స్, సాంఘికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులను చదవాల్సి వస్తుంది. భాషా పండిత అభ్యర్థులు ఈ 60 ప్రశ్నలను ఛేదించేందుకు తిప్పలుపడుతున్నారు. జీవశాస్త్రం అభ్యర్థులు గణితం, ఫిజికల్సైన్స్ల ప్రశ్నలను చదవాల్సి వస్తున్నది. ఈ అసంబద్ధ విధానాన్ని తొలగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఏపీలో ఇలా..
ఈ అనాయాన్ని సరిదిద్దేందుకు మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొన్నది. ఈ మేరకు ఇటీవలే నిర్వహించిన టెట్ -2024 నోటిఫికేషన్లో మార్పులు చేసింది. అక్కడ టెట్ -పేపర్ -2లో మూడు రకాల సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలిస్తున్నారు. గణితం, సైన్స్ వారికి ఒక పేపర్, సాంఘికశాస్త్రం ఒక పేపర్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, ఒడియా, తమిళ్, సంస్కృతం పేపర్లకు మరో పేపర్ను అమలుపరుస్తున్నారు. దీంతో ఆయా సబ్జెక్టుల నుంచే 60 ప్రశ్నలిస్తున్నారు. భాషాపండిత పోస్టులకు పోటీపడే వారికి ఈ విధానంతో ఉపశమనం కలుగుతున్నది. ఇదే తరహా విధానాన్ని మన దగ్గర అమలుచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
60 మార్కులకు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలి
భాషాపండితులకు 60 మార్కులకు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలిస్తున్నారు. గణితం, ఫిజికల్సైన్స్, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల ప్రశ్నలివ్వడంతో మాకు అన్యాయం జరుగుతున్నది. ఏపీలో అమలుచేస్తున్నట్టుగా టెట్లో మార్పులు చేసి, ఈ 60 మార్కులకు తెలుగు ప్రశ్నలే ఇవ్వాలి.
– సంతోష్కుమార్, అభ్యర్థి
ప్రత్యేకంగా పేపర్-2ఏను నిర్వహించాలి
టెట్లో తమకు సంబంధం లేని ప్రశ్నలిస్తుండటంతో భాషాపండితుల అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నది. 150మార్కుల్లో 60 మార్కులకు భాషలకు సంబంధం లేని ప్రశ్నలిస్తున్నారు. ఇది అన్యాయం. ఏపీలో భాషాపండిత అభ్యర్థుల కోసం 2018లోనే ప్రత్యేకంగా పేపర్ -2ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం జీవో -25ను జారీచేసింది. రాష్ట్రంలోని అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేకంగా పేపర్ -2ఏను నిర్వహించాలి.
– తిరుమల కాంతి కృష్ణ, ఆర్యూపీపీ తెలంగాణ