హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): చిన్నారుల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నిమ్స్ జెనెటిక్స్ విభాగం, మెటర్నల్ హెల్త్ జేడీని ఆదేశించారు. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానల పనితీరుపై మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎంసీహెచ్చార్డీ నుంచి ఆన్లైన్లో నెలవారీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యరంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన నమ్మకాన్ని వమ్ము కాకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రోగుల సంఖ్యకనుగుణంగా ఓపీ కౌంటర్లు పెంచాలని, అవయవదానంపై అవగాహన కల్పించాలని సూచించారు. బ్రెయిన్డెడ్ డిక్లరేషన్, అవయవ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య పెరగాలన్నారు. బ్రెయిన్డెడ్ నిర్ధారణ జరిగిన సందర్భాల్లో అవయవదానం చేసేలా కుటుంబసభ్యులను ఒప్పించాలని, అవసరమైతే తానే స్వయంగా మాట్లాడుతానని అన్నారు.
నిమ్స్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో నడుస్తున్న డయాలసిస్ సెంటర్లను పర్యవేక్షించడంతోపాటు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో నూతనంగా నిర్మించిన 300 పడకల నూతన బ్లాక్ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని, ఈ బ్లాక్ అందుబాటులోకి వస్తే మొత్తం పడకల సంఖ్య 750కి చేరుతుందని చెప్పారు. మొబైల్ స్రీనింగ్ బస్ ద్వారా నిర్వహించే క్యాంపుల సంఖ్య పెంచాలని, మారుమూల ప్రాంతాల్లోనూ పరీక్షలు చేయాలన్నారు. పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి, ఎకువమందికి సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు రోగులు, సహాయకులతో మర్యాదగా మెలగాలని మంత్రి సూచించారు.