రామగిరి, మార్చి 17 : పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఎగ్జామ్స్ జరుగనున్నాయి. మొదటి రోజు కంపోజిట్ తెలుగు ఉన్న విద్యార్థులకు మాత్రం ఉదయం 9.30 నుంచి 12.50 గంటల వరకు, భౌతికశాస్త్రం లేదా జీవ శాస్త్రం పరీక్షలు వేర్వేరు రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11గంటల వరకు నిర్వహించనున్నారు. పది పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 19,302 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 109 సెంటర్లు ఏర్పాటు చేశారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. అదే విధంగా ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేయనున్నారు. పరీక్ష కేంద్రంలో సిబ్బందిని తప్ప ఇతరులను ఎవరినీ అనుమతించరు. పరీక్షల నిర్వాహకులు సహా ఎవరికీ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికాలు అనుమతించడం లేదు. పరీక్ష నిర్వహణలో భాగంగా ఎలాంటి ఫిర్యాదులున్నా డీఈఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
పరీక్షల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పలు సూచనలు చేసింది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే అంటే 8.30 గంటలకే చేరుకోవాలి. 8.50 గంటలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. విద్యార్థులు పరీక్షలకు ఒక రోజు ముందుగానే కేంద్రాన్ని చూసుకోవాలి. స్టూడెంట్స్ పరీక్ష కేంద్రంలోని నిర్ణీత సమయం 9.30గంటల తర్వాత ఐదు నిమిషాలు అంటే 9.35గంటకు వరకు అనుమతిస్తారు. ఈ సారి కొత్తగా ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. విద్యార్థులు పాఠశాల యూనిఫామ్స్ను ధరించొద్దు. సివిల్ డ్రెస్లో మాత్రమే రావాలి. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినా అందుకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల సమయంలో భాగస్వాములయ్యే వారంతా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ సూచించారు.