హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు తక్షణమే టెండర్లు పిలవాలని అధికారులను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాలైన కోకాపేట, ఉప్పల్ భగాయత్లో బీసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని కార్యాయలంలో మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోకాపేటలో హెచ్ఎండీఏ మౌలిక వసతులను అభివృద్ధి చేసిందని, ఉప్పల్ భగాయత్లో మౌలికవసతుల కల్పించాలని మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ను ఆదేశించారు. అన్ని రంగాల్లో బీసీలు ఎదిగేందుకు ప్రణాళికలను రూపొందించాలని, త్వరలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. బీసీ నిరుద్యోగ యువత కోసం రూ.25 లక్షలతో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న అంబులెన్స్ పథకంతోపాటు మరెన్నో పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అనేకరాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇటీవలే నాయీబ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గౌడన్నలకు మోపెడ్లు ఇవ్వాలి: మంత్రి శ్రీనివాస్గౌడ్
గీత కార్మికులకు మోపెడ్లు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ను ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కోరారు. గౌడ సొసైటీల్లోని అర్హులైన ప్రతిఒక్కరికీ సహాయం చేయాలని కోరారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తికి మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందించారు. గౌడకులస్థులకు మోపెడ్లు అందించటంతోపాటు పూసల, మేదరి కులస్థుల కోసం అందిస్తున్న పూసల బండ్ల పథకంపై ఈ సందర్భంగా ఆరాతీశారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.