రూ. 1,700 కోట్లు .. ప్రభుత్వం గర్భిణులకు ఇచ్చిన మొత్తం
ఐదేండ్లలో రికార్డు స్థాయిలో కేసీఆర్ కిట్లు
గర్భిణుల కుటుంబాలకు 4,500 కోట్లు ఆదా
ఏటా 2 లక్షలమందికి అందిన సాయం
ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు
గణనీయంగా తగ్గిన మాతాశిశు మరణాలు
ప్రైవేట్కెళ్తే లక్షల్లో ఖర్చు
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్ చేయించుకొంటే లక్షల్లో ఖర్చు అయ్యేదని, ప్రభుత్వ దవాఖానలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేశారని సంతోషం వ్యక్తం చేసింది. తన బిడ్డకు కావాల్సిన వస్తువులు కూడా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : సమాజానికి ఆరోగ్యవంతమైన శిశువులను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ల పథకం మరో మైలురాయిని అధిగమించింది. ఈ పథకం ద్వారా ఐదేండ్లలో లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది. సీఎం కేసీఆర్ 2017 జూన్ 3న ప్రారంభించిన ఈ పథకం గర్భిణులకు ఆర్థికసాయం అందించడంతోపాటు సామాజికంగా అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెరిగాయి. మాతా శిశు మరణాలకు అడ్డుకట్టపడింది. ప్రైవేట్కు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో ప్ర సవం చేయించుకోవడంతో ఒక్కొక్కరికి సగటున రూ.40 వేల దాకా ఆదా అయింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకున్న అన్ని కుటుంబాలకు కలిపి దాదాపు రూ.4,500 కోట్లు ఆదా అవ్వడమే కాకుండా ప్రభుత్వం నుంచే వారికి కేసీఆర్ కిట్ రూపంలో రూ.1,700 కోట్లు ముట్టడం విశేషం.
దేశంలోనే ఉత్తమంగా నిలిచిన కేసీఆర్ కిట్
కేసీఆర్ కిట్ ప్రారంభం వెనుక గొప్ప ఆలోచన ఉన్నది. ప్రసవాలు వంద శాతం సర్కారు దవాఖానల్లోనే జరిపించడం, మాతా శిశు మరణాలను తగ్గించడం సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇందుకు దేశవ్యాప్తంగా మాతాశిశు సంరక్షణకు అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తమిళనాడులో ‘ముత్తు లక్ష్మీరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీం’ కింద రూ.12 వేలు సాయం చేస్తున్నట్టు గుర్తించారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు అధికారులు తమిళనాడు వెళ్లి అధ్యయనం చేశారు. సీఎం కేసీఆర్ ఈ నివేదికను పరిశీలించిన అనంతరం తెలంగాణలో రూ.15 వేల సాయం చేయాలని నిర్ణయించారు. సర్కారు దవాఖానలో ప్రసవించి, మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డకు 13 వేల చొప్పున అందిస్తున్నారు. దీనికి అదనంగా రూ.2 వేల విలువ చేసే 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను అందజేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ కిట్ కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.
రూ.263 కోట్ల విలువైన వస్తువులు
ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డకు అవసరమయ్యే 16 రకాల వస్తువులను ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో అందజేస్తున్నది. బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్, దోమతెర, చిన్నబెడ్, రెండు బే బీడ్రెస్లు, తల్లికి రెండు చీరలు, టవళ్లు వంటివి ఇందులో ఉం టాయి. ఇవి దాదాపు 3 నెలల పాటు శిశువు అవసరాలను తీరుస్తాయి. కేసీఆర్ కిట్ అందుకున్న గర్భిణులు అందరికీ కలిపి ఏటా సగటున రూ.50 కోట్లకు పైగా విలువైన వస్తువులు అందుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున రూ.263 కోట్లు విలువైన వస్తువులను తల్లులకు అందించడం విశేషం.
కేసీఆర్ కిట్తో వచ్చిన మార్పులు అమోఘం
కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా గర్భం దాల్చిన ప్రతి ఒక్కరి వివరాలను స్థానిక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రభు త్వ దవాఖానల్లో డెలివరీ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గర్భిణిని ఇంటి దగ్గరి నుంచి అమ్మ ఒడి లేదా 108 వాహనంలో దవాఖానకు ఉచితంగా తీసుకెళ్లడం, ఉచితంగా డెలివరీ చేయడం, కేసీఆర్ కిట్ అం దించడం, తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటిదగ్గర దిం పడం వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కూడా పెరిగింది. గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యసిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండటం, ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం, కేసీఆర్ కిట్ కింద ఇచ్చే నగదుతో ఆర్థిక తోడ్పాటు, తద్వా రా గర్భిణికి విశ్రాంతి లభించడం, దవాఖానలో డెలివరీ అవుతుండటం, ఆశ కార్యకర్తలు బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం (పీఎన్సీ విజిట్స్) వంటి చర్యల వల్ల మాతృమరణాలు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రం లో నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు భారీగా తగ్గాయి.
టీకాల పంపిణీలో దేశంలోనే టాప్
పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో కేసీఆర్ కిట్లు కూడా కీలకపాత్ర పోషించాయి. దవాఖానలో ప్రసవం తర్వాత నవజాత శిశువులకు అక్కడే తొలి టీకా వేస్తున్నారు. శిశువుకు మూడున్నర నెలల వయసులో టీకాలు వేసినప్పుడు రూ.2 వేలు, 9 నెలల సమయంలో టీకాలు వేసినప్పుడు రూ.3వేలు చొప్పున కేసీఆర్ కిట్ కింద ఇస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిల్లలకు టీకాలు వేయిస్తున్నారు. 2014లో 68శాతం మంది పిల్లలకు మాత్రమే టీకాలు వేయగా.. 2021 నాటికి 100 శాతానికి పెరిగింది. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది.
‘కేసీఆర్’ కిట్ బాగున్నది
ఈమె పేరు లోకిని కవిత. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామస్తురాలు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెలా ప్రభుత్వ దవాఖానలో చూపించుకుంటున్నది. అన్ని పరీక్షలు కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేయించుకునేది. ఈ నెల 14న డెలివరీ కోసం వచ్చింది. అదేరోజు వైద్యులు సిజేరియన్ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటిరోజే ఎంసీహెచ్ అధికారులు ఆమెకు కేసీఆర్ కిట్ అందించారు. తాను ప్రైవేట్ దవాఖానకు వెళ్తే కనీసం రూ.60 వేలైనా ఖర్చయ్యేవని, కేసీఆర్ సార్ కారణంగా ఒక్క రూపాయి లేకుండా ప్రసవం చేసి పైగా కేసీఆర్ కిట్ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసింది.
పుట్టినిల్లుగా మారిన ప్రభుత్వ దవాఖానలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానలు ఆడబిడ్డలకు పుట్టినిల్లుగా మారాయి. గర్భం దాల్చిననాటి నుంచి ప్రసవం జరిగి, తల్లీ బిడ్డ ఇంటికి వెళ్లేవరకు కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. గర్భిణులకు కనీసం ఆటో ఖర్చు కూడా లేకుండా చెకప్కు తీసుకెళ్లి, తీసుకొస్తున్నాం. ప్రసవం తరువాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాం. దీంతోపాటు కేసీఆర్ కిట్ రూపంలో నగదు, బహుమతిగా అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను 52 శాతానికి పెంచగలిగాం. -మంత్రి హరీశ్రావు