హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనున్న సమ్మక్క సారక్క మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈసారి తాత్కాలిక విడిది కేంద్రాలు నిర్మించాలని నిర్ణయించింది. నార్లాపూర్ నుంచి మేడారం, కన్నెపల్లి నుంచి మేడారం, ఊరట్టం నుంచి మేడారం వెళ్లే ప్రాంతాల్లో, జాతర ప్రాంగణంలో జంపన్నవాగు, రెడ్డిగూడెం, చిలుకలగుట్ట, ఇంగ్లిష్ మీడియం స్కూల్, బస్టాండ్ ఏరియాలో భక్తులు సేదతీరేందుకు షెడ్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన రూ.75 కోట్ల నిధులతో జాతర ఏర్పాట్లు ఊపందుకొన్నాయి. పనులను పరిశీలించేందుకు మంత్రి సత్యవతిరాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి గురువారం మేడారంలో పర్యటించనున్నారు. రెండు శాఖల ఉన్నతాధికారులతోపాటు ములుగు జిల్లా అధికారులు, ఏటూరునాగారం ఐటీడీఏ ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.