హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. గత వారం రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉండడంతో రోడ్లకు మరమ్మతులు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడించారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు అంచనాలు ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం అనుమతించగానే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడతామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల 23 జిల్లాలు ప్రభావితమయ్యాయి.
నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో రోడ్లకు భారీగా నష్టం జరిగింది. మొత్తం 1,398 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం జరిగినట్టు అధికారులు గుర్తించారు. సుమా రు 50.60 కి.మీ. మేర రోడ్లు కొట్టుకుపోయాయని, క్రాస్ డ్రైనేజీలు, కల్వర్టులు అన్నీ కలిపి 532 దెబ్బతిన్నట్టు తెలిపారు. వీటిని తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు రూ.195.52 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.1,587 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చే యడంతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.