TS Weather | హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరిస్తున్నారు.
ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడంతో పాటు గాలిలో తేమశాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.