హైదరాబాద్, డిసెంబర్ 28, (నమస్తే తెలంగాణ): రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్టు జస్టిస్ సూరేపల్లి నందా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
టీడీపీ జెండాలు, నేతల పేర్లతో సినిమా తీశారని, తమ పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలుచేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని నిర్మాత, దర్శకులు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నామని తెలుపుతూ తదుపరి విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేశారు.