హైదరాబాద్: తెలుగు అకాడమీలో నిధులు దారి మళ్లించిన కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ క్రమంలో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అకాడమీకి చెందిన మరో రూ.17 కోట్లు గల్లంతైనట్లు బయటపడింది. హైదరాబాద్లోని కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖలో గతేడాది జూలై నుంచి విడతలవారీగా మొత్తం రూ.43 కోట్లు గల్లంతయ్యాయి.
ఇదే బ్యాంకు సంతోష్ నగర్ బ్రాంచిలో మరో రూ.8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమైనట్లు తెలిసింది. ఈ మొత్తం జూలై, ఆగస్టు నెలల్లో పోయినట్లు సమాచారం. కెనరా బ్యాంకు నుంచి మరో రూ. 9కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా కాజేసినట్లు దర్యాప్తులో బయటపడింది. తాజాగా వెలుగు చూసిన ఈ రూ.17కోట్లతో కలిపి ఈ మొత్తం కుంభకోణం విలువ రూ.60 కోట్లకు చేరింది.
ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు వేసింది. ఈయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన విధులు నిర్వర్తించనున్నారు.