ఆరున్నరేండ్లలో కేంద్రానికి పన్నులు రూపంలో తెలంగాణ రూ.2.75 లక్షల కోట్లు కట్టింది. కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టానికిచ్చింది కేవలం రూ.1.40 లక్షల కోట్లే. ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు
– మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఆరున్నరేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నయా? అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. ఉంటే చూసొద్దామంటూ ఆ పార్టీ నేతలకు సవాల్విసిరారు. అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒకటే అర్రతో డబ్బా ఇల్లు కట్టిండ్రు.
బ్యాంకు లోనని.. ఇదని అదని తిప్పుకొని మూడు రంగుల ఇల్లుకు మూడు చెర్ల నీళ్లు తాగించిండ్రు’ అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. నయాపైసా భారం మోపకుండా, ఏ బ్యాంకు చుట్టూ తిరుగకుండా రూ.5.40 లక్షలతో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్న కేసీఆర్ ఆలోచన దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మోహినికుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి.. 65 మంది లబ్ధిదారులను గృహప్రవేశం చేయించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. నిధులు కేంద్రానివి, సోకు రాష్ర్టానిదంటూ కొందరు సోషల్మీడియాలో చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
ఆరున్నరేండ్లలో కేంద్రానికి పన్నులు రూపంలో తెలంగాణ రూ.2.75 లక్షల కోట్లు కడితే.. కేంద్రం రాష్ర్టానికిచ్చింది కేవలం రూ.1.40 లక్షల కోట్లని తెలిపారు. ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. 82 మీటర్ల ఎత్తున ఉన్న కాళేశ్వరం నుంచి 610 మీటర్ల ఎత్తున ఉన్న కొండ పోచమ్మకు గోదావరి జలాలు రావడం అపరభగీరథుడు కేసీఆర్ చేసిన కృషి ఫలితమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
కరోనాలోనూ ఆగని సంక్షేమం
దేశవ్యాప్తంగా కరోనా తరుముకొస్తున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపడంలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. రైతుకు మద్దతు ధర కల్పించేందుకు 6,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రైతు వేదికలన్నింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అభివృద్ధి పనులు చేస్తున్నందుకే పంచాయతీలు.. కేంద్ర అవార్డులు అందుకుంటున్నాయని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డె, నాఫ్స్క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రగతికి ప్రశంసలు
జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలంలోని బందనకల్ శివారులో సహకార సంఘ పెట్రోల్ బంకుకు, మోహినికుంటలో డబుల్ బెడ్రూం ఇండ్లకు, మద్దికుంటలో రైతువేదికకు ప్రారంభోత్సవం చేశారు. ముస్తాబాద్ మండలకేంద్రంలో రూ.50 లక్షలతో తన నాయినమ్మ వెంకటమ్మ, తాతయ్య రాఘవరావు పేరిట నిర్మించిన భారీ రైతు వేదికను కేటీఆర్ ప్రారంభించారు. చీకోడులో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనాలను, ఆవునూరులో రైతువేదిక, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లో కమ్యూనిటీ భవనం, వైకుంఠధామం, పల్లెపకృతి వనాలకు ప్రారంభోత్సవం చేశారు. కేంద్ర అవార్డులకు ఎంపికైన మోహినికుంట, హరిదాస్నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాలను సన్మానించారు. కాళేశ్వరం జలాలు రావడంపై హర్షంవ్యక్తంచేస్తూ ముస్తాబాద్ మండల రైతులు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ను సన్మానించారు.