తెలంగాణకు వచ్చే ముందు మేం 8 ఇతర రాష్ర్టాలను సందర్శించాం. తెలంగాణలో ఉన్న స్పిరిట్ ఆ రాష్ర్టాల్లో కనిపించలేదు. తెలంగాణలో ఉన్నట్టు వ్యాపార అనుకూల దృక్పథం, ప్రభుత్వ ప్రోత్సాహం మరెక్కడా కనిపించలేదు. అందుకే ఈ రోజు మేం ఇక్కడున్నాం. అందుకు కేటీఆర్కు కృతజ్ఞతలు.
– ఒలివియర్ మోనిన్, మోనిన్ గ్రూప్ చైర్మన్
తమ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నదని, పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ కోరారు. ఆయన ప్రోద్బలంతోనే మోనిన్ గ్రూప్ తెలంగాణకు వచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వ పాలసీలు ఉండటం చూసి ఆశ్చర్యపోయా.
– జెర్మాన్ అరాడ్, మోనిన్ ఇండియా ఎండీ
Telangana | సంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భారత్ అంతటా చూస్తే పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని మోనిన్ గ్రూప్ చైర్మన్ ఒలివియర్ మోనిన్ స్పష్టం చేశారు. అందుకే తాము సంగారెడ్డి జిల్లాలోని గుంతపల్లిలో మోనిన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మోనిన్ కంపెనీ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మోనిన్ కంపెనీ చైర్మన్ ఒలివియర్ మోనిన్, మోనిన్ ఇండియా ఎండీ జెర్మాన్ అరాడ్ హాజరయ్యారు. ఇద్దరు పంచెకట్టులో కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఒలివియర్ మోనిన్ మాట్లాడుతూ.. మోనిన్ కంపెనీకి ఇండియా అతి ముఖ్యమైన మార్కెట్ అని తెలిపారు. భారత్తో పాటు దక్షిణాసియా అంతటా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు 2016లో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
తెలంగాణకు ముందు పరిశ్రమ ఏర్పాటు కోసం 8 రాష్ర్టాల్లో పర్యటించామని, ఎక్కడా పరిశ్రమ ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపించలేదని వెల్లడించారు. మోనిన్ పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేటీఆర్ తమను కోరారని తెలిపారు. ఆయన కోరిక మేరకు 2018లో తెలంగాణలో పర్యటించి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించినట్టు వివరించారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నదని, అందుకే తాము ఈ రోజు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్పిరిట్తోనే త్వరలోనే కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మోనిన్ ఇండియా ఎండీ జెర్మాన్ అరాడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ వల్లే మోమిన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
2016లో 10 రాష్ర్టాల్లో పర్యటించామని, చివరికి మంత్రి కేటీఆర్ను కలిసి ఇక్కడి పాలసీలు తెలుసుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణంతోపాటు ప్రభుత్వ పాలసీలు అనుకూలంగా ఉండటంతో ఆశ్చర్యపోయానని అన్నారు. మొదట 2018లో హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకున్నామని వివరించారు. కొవిడ్ కారణంగా పరిశ్రమను ప్రారంభించలేకపోయామని, ప్రస్తుతం భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇక్కడే మ్యాన్యుఫాక్చరింగ్ హాబ్, ఆర్అండ్డీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మోనిన్ యువతకు నచ్చేలా దేశీ ఉత్పత్తులు, దేశీ ప్లేవర్డ్ సిరప్, జ్యూస్లను తయారు చేయనున్నట్టు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు నిలయంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా విదేశీ పెట్టుబడిదారులు తెలంగాణకే క్యూ కడుతున్నారని వెల్లడించారు. మోనిన్ పరిశ్రమను 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనున్నారని, తొలి విడతలో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారని ప్రకటించారు. ఈ సంస్థ ప్రపంచంలో 8వ ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేయటం గొప్ప విషయమని, ఇప్పటికే ఫ్రాన్స్లో 2, అమెరికాలో 2, రష్యా, మలేషియా, చైనాలో ఒకటి చొప్పున ఏర్పాటు చేశాయని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, మెరుగైన పాలన, మంచి పాలసీలతోనే పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. ఈ సంస్థ ప్రతినిధులు దేశంలోని 8 రాష్ర్టాల్లో పర్యటించారని, తెలంగాణ ఉన్న వసతులు ఎక్కడా కనిపించకపోవటంతో తెలంగాణ వైపు చూశారని తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి గురించి విని పెట్టుబడులతో రాష్ర్టానికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఎస్ఐపాస్ విధానంతో పరిశ్రమల స్థాపనకు సులభమైన పద్ధ్దతిలో అనుమతులు ఇవ్వటంతో పాటు మౌలిక వసతులు కల్పించటంతో ఆకర్షితులై రాష్ర్టానికి పెట్టుబడిదారులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ కాలుష్యానికి అతీతంగా ఉత్పత్తులు చేస్తుందని తెలిపారు. పరిశ్రమ నిర్మాణానికి సహకారం అవసరమైతే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అందుబాటులో ఉంటారని పరిశ్రమ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
పరిశ్రమల స్థాపనతో అభివృద్ధి జరిగిందని అనుకుంటాం కానీ, మానవాళికి కావాల్సిన ఆహారం.. వ్యవసాయం చేస్తేనే వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ దిశగా ఆలోచించిన కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకోవటంతో రాష్ట్రంలో ఉత్పత్తులు బాగా పెరిగాయని వెల్లడించారు. గతంలో 68 లక్షల టన్నులు పండిన ధాన్యం నేడు 3.50 కోట్ల టన్నులకు చేరిందని, తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని వివరించారు. వీటితో పాటు 5 రకాల విప్లవాలు తీసుకొచ్చి హరిత తెలంగాణను తయారు చేయటంతో పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడిదారులు పరుగులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో తమ పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సముద్ర తీరం లేకున్నా దేశానికే ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తిలో ముందు నిలిపి, మత్య్సకారులకు చేతి నిండా పని కల్పించిన ప్రభుత్వం తెలంగాణే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 46 వేల చెరువుల్లో 30 కోట్లకు పైగా చేప పిల్లలు వదిలి నీలి విప్లవాన్ని సృష్టించి ఇతర రాష్ర్టాలకు చేపలను ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు. రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేసి, మాంసం ఉత్పత్తి పెంచి గులాబీ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చి శ్వేతవిప్లవాన్ని సృష్టించారని తెలిపారు. ఎల్లో విప్లవంలో పారిశ్రామికంగా అభివృద్ధి సాధించటంతో పాటు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట పండించేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జిల్లా ఎస్పీ రమణకుమార్, అదనపు ఎస్పీ మాధురి, ఆర్డీవో రవీందర్రెడ్డి, సంస్థ ప్రతినిధులు థియరీ బెర్థెలాట్, జార్జెస్ మోనీస్ తదితరులు పాల్గొన్నారు.