హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ పీస్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాస్ సత్యార్థి అన్నారు.
మంగళవారం న్యూఢిల్లీలో కైలాస్ సత్యార్థితో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సహా వరంగల్, మహబూబాబాద్ లలో నిర్మించిన, నిర్మిస్తున్న బాల బాలికలు, మహిళా రక్షణ ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేసిన విషయం కైలాస్ సత్యార్థికి వినోద్ కుమార్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా బాల బాలికలపై జరుగుతున్న వివిధ రూపాల దాడుల నివారణ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న కైలాస్ సత్యార్థి.. తెలంగాణ రాష్ట్రంలో బాల బాలికల కోసం అమలు జరుగుతున్న పథకాలపై వినోద్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు తీరిన బాల బాలికల వివాహాలకు మాత్రమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయని వినోద్ కుమార్ ఆయనకు తెలిపారు.
అమెరికాలో సెప్టెంబర్ 18 న జరుగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సులో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను అని కైలాస్ సత్యార్థి పేర్కొన్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.
అక్టోబర్ నెలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బాలల రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరు కావాలని వినోద్ కుమార్ ఈ సందర్భంగా కైలాస్ సత్యార్థిని కోరగా, అందుకు ఆయన తన సంసిద్ధతను తెలిపారు.