హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాశవిక విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని తెలంగా ణ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ ఢిల్లీలో పాలనాధికారాలు లాక్కొనే విధంగా కేంద్ర ప్ర భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ శనివారం హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యా రు. కేంద్ర ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కేసీఆర్ను కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ బృందం శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నది. ఆయన వెంట పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి, ఆప్ ఎంపీ సంజయ్సింగ్ తదితరులు ఉన్నారు. వీరికి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ భేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్వాగతం పలికారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పలు అం శాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం అరాచకాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదామని ప్రతిపాదించారు.