ఒక్క ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు.. ఎనిమిదేండ్లలో 140 శాతం వృద్ధి.. ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.83 లక్షల కోట్ల విలువైన సేవల ఎగుమతులు.. కరోనా సృష్టించిన సమస్యలన్నింటినీ అధిగమించి ఏడాదిలో ఏకంగా 26.14 శాతం వృద్ధి.. ఇదీ తెలంగాణ ఐటీ పరిశ్రమ దమ్ము. కేంద్రప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా ఐటీరంగం నేలచూపులు చూస్తుంటే.. హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఐటీ నివేదికను ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం మాదాపూర్లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగం కొత్తపుంతలు తొక్కుతూ అభివృద్ధి చెందిన తీరును ఈ నివేదిక కండ్లకు కట్టింది. 8 ఏండ్ల క్రితం 58 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,83,569 కోట్లకు (220 శాతం వృద్ధిరేటు) చేరుకొన్నాయి. 2021-22లో రాష్ట్ర ఐటీ వృద్ధిరేటు 26.14 శాతం.
ఇదే సమయంలో జాతీయ ఐటీ సగటు వృద్ధి కేవలం 17.2 శాతమే కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఈ రంగంలో గత ఏడాది 5.43 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడగా, అందులో తెలంగాణలోనే లక్షన్నర ఉండటం విశేషం. అదే దూకుడును కొనసాగిస్తూ.. 2021 -26 మధ్య రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో ఐటీ పాలసీని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసినా, ఏ విషయంలోనూ సహకరించకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర స్థానంలో నిలిచిందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని రికార్డు వృద్ధి నమోదు చేసింది. ఐటీ కంపెనీలు, టెకీలకు స్వర్గధామంలా మారిన తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఐటీ వృద్ధిలో దుమ్మురేపింది. ఒక్క ఏడాదే రాష్ట్ర ఐటీరంగం ఏకంగా లక్షన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఐటీ నివేదికను ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం మాదాపూర్లోని టెక్ మహీంద్రాలో విడుదల చేశారు.