Minister KTR | బయో ఏషియా-2023 ( Bio Asia 2023 ) విజయవంతం అయ్యింది. ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పరిశోధకులు, హెల్త్కేర్, బయోటెక్ సంస్థల అధిపతుల రాకతో హైదరాబాద్ గ్లోబల్ వెలుగులు సంతరించుకున్నది. లైఫ్సైన్సెస్ రాజధానిగా నగరం ఎదుగుతున్నదని ప్రపంచానికి మరోసారి తెలిసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఆర్థికాభివృద్ధిలో ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే మూడు అంశాలే బలమైన చోదకాలుగా తాను విశ్వసిస్తానని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మూడు ‘ఐ’లే సమయం వచ్చినప్పుడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రతిభావంతమైన దేశంగా నిలుపుతాయని పేర్కొన్నారు. శనివారం హెచ్ఐసీసీలో బయో ఏషియా-2023 ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. బయో ఏషియా ఆసియా ఖండంలోనే అతి పెద్ద లైఫ్ సైన్సెస్ కార్యక్రమమని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 20వ విడత సదస్సుకు అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. సదస్సుకు 50 దేశాల నుంచి 2000లకు పైగా ప్రతినిధులు హాజరు కాగా, 200లకు పైగా బీ2బీ సమావేశాలు జరిగాయని వెల్లడించారు. రెండు రోజులపాటు జరిగిన చర్చల్లో పలు కీలక అంశాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం గురించి బయో ఏషియా సదస్సు ద్వారా ప్రపంచానికి మరోసారి తెలిసిందని అన్నారు.
తెలంగాణలో ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేసేలా మనం ఎదగాలని పిలుపునిచ్చారు. మనదేశం నైపుణ్యం, అద్భుత తెలివితేటలున్న యువతకు నిలయంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మానవ వనరులను సరిగ్గా వినియోగించుకొంటే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. ఈసారి బయో ఏషియా సదస్సులో భాగంగా 175కు పైగా ఎగ్జిబిటర్లు, స్టార్టప్ల నిర్వాహకులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, వాటిలో అత్యుత్తమమైన 5 స్టార్టప్లను ఎంపిక చేశారని వెల్లడించారు. తెలంగాణలోని ఎకో సిస్టంతో ప్రపంచ స్థాయి ఉత్పత్తులను సృష్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇందులో ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బయో ఏషియా-2023 విజయవంతంగా నిర్వహించడంలో లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి క్యాథ్రీన్ కివీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే పార్మా క్యాపిటల్గా మారిందని అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్లకు ప్రోత్సాహం అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా ఎకానమీ అండ్ ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ జమైటిస్ కారోలిస్, ఒడిశా మంత్రి అశోక్చంద్ర పాండ, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.