హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది. మరే రాష్ర్టానికి సాధ్యంకాని విధంగా దిగుబడిని పెంచింది. 1970-71లో ఆహార ఉత్పత్తుల దిగుబడిలో దేశంలో 23వ స్థానంలో ఉన్న తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్).. 2019-20లో సరాసరి మూడో స్థానానికి ఎగబాకింది. గతంలో తెలంగాణలో హెక్టారుకు 781 కిలోల ఆహార ఉత్పత్తులు దిగుబడి కాగా ప్రస్తుతం ఇది 3,483 కిలోలకు పెరిగింది. గతంతో పోల్చితే 2,702 కిలోలు పెరగడం విశేషం. పంటల ఉత్పత్తి దాదాపుగా ఐదు రెట్లు పెరిగింది. ఇటీవల నాబార్డ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
అగ్రస్థానం దిశగా అడుగులు
పంట ఉత్పత్తుల దిగుబడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం దిశగా అడుగులు వేస్తున్నది. ఒకప్పుడు తెలంగాణ వేరు.. ఇప్పటి తెలంగాణ వేరు. సీఎం కేసీఆర్ అమలు చేస్తు న్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో వ్యవసాయరంగంలో గుణాత్మకమైన మార్పులు ఆవిష్కృతమయ్యాయి. మిగిలిన రాష్ర్టాలు ఒక్కో స్థానం దిగజారుతుంటే తెలంగాణ మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నది. హెక్టారుకు 4,527 కిలోల దిగుబడితో పంజాబ్ తొలిస్థానంలో ఉండగా 3,891 కిలోలతో హర్యానా రెండో స్థానంలో ఉన్నది. 3,483 కిలోలతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
అంటే పంజాబ్కు తెలంగాణకు మధ్య వ్యత్యాసం 1,044 కిలోలు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో దిగుబడి పెరగడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలోనే దిగుబడిలో పంజాబ్ను వెనక్కి నెట్టి రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.