హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) లింక్ లిఫ్ట్ స్కీం విస్తరణ పనులకు టెండర్లను ఆహ్వానించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. సత్వరమే వాటిని నిలిపేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్కు సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా రెండు రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులను చేపట్టకూడదని, ఏపీ అందుకు విరుద్ధంగా హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ విస్తరణ పనులను చేపడుతున్నదని ఆక్షేపించింది. వాటితోపాటు కాలిబండా, బెస్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ఏపీ టెండర్లు పిలవడాన్ని తప్పుపట్టింది. బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ఆ ప్రాజెక్టులను చేపడుతున్నదని మండిపడింది.