ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 27: తార్నాక డివిజన్లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలను డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి కిమితి కాలనీ, సత్యానగర్, లాలాపేట, చంద్రబాబునాయుడు నగర్, మాణికేశ్వరీనగర్, సాయినగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. కొన్ని ఇండ్లలోకి వర్షం నీరు ప్రవేశించగా తీసివేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గాలులకు చెట్లు విరుగుతాయని , స్తంభాలు కూలుతాయని అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఇలాంటి సమస్యలను గుర్తించి వెంటనే జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నంబర్ 040-23225397, తమ క్యాంపు కార్యాలయం నంబర్ 040-27152242లను సంప్రదించాలని సూచించారు.