బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 23: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందంటూ అపహాస్యం చేశారని, వారి మాటలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని స్పష్టంచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 7,370 మెగావాట్ల విద్యత్తు మాత్రమే అందుబాటులో ఉండేదనీ, నేడు 14 వేల మెగావాట్లు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని 25 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రభుత్వం పనులు చేపట్టిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం సూచించినా, రైతుల సంక్షేమమే ధ్యేయమని సీఎం కేసీఆర్ స్పష్టంచేసినట్టు స్పీకర్ గుర్తుచేశారు. తెలంగాణలో పండిన వడ్లను కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు.