హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఆరు నూరైనా సరే ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు తనకిచ్చిన సర్వశక్తులు, మేధోసంపత్తిని ఉపయోగిస్తానని, చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు దేశాన్ని చక్కదిద్దేందుకు పాటుపడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ర్టాలు బాగుండాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని చెప్పారు. దేశం పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం కావాలని అన్నారు. ఇప్పుడు ఈ దేశంలో దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తున్నదని, కులాలు, మతాల పేరిట చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికే మార్గదర్శనం చేసే స్థాయికి ఎదిగిందని, ఇక తెలంగాణ ప్రగతి ప్రయాణం ఆగబోదని అన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టు పునరుద్ఘాటించారు. మల్లన్నసాగర్ జలాశయాన్ని ప్రారంభించిన అనంతరం సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
దేశాన్ని దారిల పెడదాం..
దేశంలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటున్నది. మత కల్లోలాలు రేపుతున్నరు. సిలికాన్ వ్యాలీగా ఖ్యాతి గడించిన బెంగళూరుకు పోవాలంటే ఇవ్వాల అందరూ భయపడుతున్నరు. సర్వనాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఇది చాలా ప్రమాదకరం. మతం పేరిట జరిగే దుర్మార్గాన్ని సహించకూడదు. ఆ క్యాన్సర్ విస్తరించరాదు. ఎక్కడికక్కడ నలిసి పారేయాలె. దేశం నుంచి తరిమికొట్టాలె. ప్రజాజీవితంలో ఉన్న కాబట్టి, ప్రజల కోసం పనిచేయాలని సంకల్పించిన వాళ్లు ప్రజలకు ఏది చేటో దానిని కచ్చితంగా నిగ్గదీసి.. ఎదిరించి.. బండకేసి కొట్టాలి. వాటిని క్షమించే ప్రసక్తే ఉండవద్దు. ఆ విధంగా మనం అందరం పురోగమించాలి. అందులో భాగంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా నేను ముందుకు సాగుతున్న.
తెలంగాణ ప్రగతి ప్రయాణం ఆగదు..
ఒకే ఒక్క మనిషిని.. దేవునికి దండం పెట్టి పిడికెడు మందితో బయల్దేరితే తెలంగాణ సాకారమైంది. అంతకంటే గొప్ప విషయం దేశానికే అద్భుతమైన మార్గదర్శనం చేసే స్థితికి తెలంగాణ ఎదగడం. నీటి చుక్కలేక, ఒక్క గింజ పండియ్యలేక, వలసలతో, రైతుల ఆత్మహత్యలతో అల్లాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో దేశానికే మార్గదర్శనంచేసే స్థాయికి ఎదిగింది. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో మనం ముందున్నాం. దేశానికి మార్గదర్శనం చేసే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. మన పథకాలను అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా మన రాష్ర్టానికి వస్తాననడం మనకు గర్వకారణం. ఎవరో ఒకరు అవాకులు చెవాకులు మాట్లాడినంత మా త్రాన మన ఈ ప్రగతి ప్రయాణం ఆగదు. మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరమున్నది.