మన్సూరాబాద్, మే 4: వ్యాక్సినేషన్తో పాటు కరోనా టెస్ట్ల కోసం మన్సూరాబాద్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ప్రెస్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్తో పాటు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా టెస్ట్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లాట్లో ఇచ్చిన సమయానుసారంగా వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత ఉన్నట్లు తనకు దృష్టికి వచ్చిందని.. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.
వ్యాక్సినేషన్తో పాటు కరోనా పరీక్షల కోసం వచ్చే వారు ఎండ బారిన పడకుండా ఉండేందుకు గాను జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయా ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారిలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారని.. వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం రాని వారు టీకాలు తీసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా బారినపడి హోం ఐసొలేషన్లో ఉన్న వారికి ఇంటి వద్దకే కిట్లను పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులేందర్ నాయుడు, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు అనంతుల రాజిరెడ్డి, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.