CM KCR | హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు 23,000 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయినందున పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేసి రెవెన్యూ శాఖలో కొనసాగించాలని వారు కోరారు. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ట్రెసా అనేక మార్లు రిప్రెసెంట్ చేసిందని ట్రెసా ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి దగ్గర చర్చించినపుడు వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో కొనసాగిస్తామని సుమారు 3 వేల మందిని మాత్రమే ఇరిగేషన్ శాఖకు ఆప్షన్స్ ద్వారా పంపిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కావున ప్రభుత్వం రెవెన్యూ విధులను బట్టి సిబ్బందిని కేటాయించి రెవెన్యూ శాఖను బలోపేతం చేయుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులరైజ్ చేయడం పట్ల రాష్ట్రంలోని వీఆర్ఏలందరికి ట్రెసా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది.