Bollepalli | భువనగిరి కలెక్టరేట్, జనవరి 27: యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి దేశంలోనే అత్యంత అరుదైన గౌరవం లభించింది. పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్న గ్రామంగా బొల్లేపల్లి చరిత్రకెక్కింది. బొల్లేపల్లికి ఒకప్పటి ఆవాస గ్రామమైన ఆకుతోటబావి తండా వాసి కేతావత్ సోంలాల్ నాయక్కు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఈ ఘనత సాధ్యమైంది. భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా లిపిలోకి అనువందించినందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇంతకుముందు బొల్లేపల్లి గ్రామానికే చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి 1992లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ముఖ్యులకు పద్మ అవార్డులు దక్కడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీచేసిన నారాయణరెడ్డి.. నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అప్పటి పార్లమెంట్ భవనాన్ని నారాయరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం.