కోనరావుపేట, ఆగస్టు 12 : రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాగా, రెండు పంపుల ట్రయల్ రన్ను ఇప్పటికే వేర్వేరుగా చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 8:30 గంటలకు ట్రాన్స్ కో పవర్ గ్రిడ్ ప్రత్యేక అనుమతితో 6 గంటల పాటు ట్రయల్ నిర్వహించి గోదావరి జలాలను మల్కపేట రిజర్వాయర్లోకి ఎత్తి పోశారు.
ఒక పంపును (మొదటిది) మాత్రం 72 గంటల పాటు నిరంతరాయంగా నడుపనున్నారు. తద్వారా భవిష్యత్తులో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడనున్నారు. ఆ తర్వాత రెండో పంపును కూడా 72 గంటల పాటు నిరంతరాయంగా నడుపనున్నారు. ఇలా చేసిన తర్వాత పంప్హౌస్ సింక్రనైజ్ కానున్నది. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఎన్ వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ఆదేశాలతో ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి ట్రయల్న్ సమన్వయ సక్సెస్ బాధ్యతలు చూస్తున్నారు. ఎంఆర్కేఆర్, డబ్ల్యూపీఎల్ ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి ట్రయల్ రన్ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు.
మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంలో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. దీంతో బీడు భూములు సస్యశామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.