హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణబిల్లు అర్థరహితమని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. ఈ బిల్లును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు వ్యతిరేకించారని గుర్తుచేశారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని శనివారం బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయిన ప్రభాకర్రావు మాట్లాడుతూ విద్యుత్తు.. ఉమ్మడి జాబితాలోని అంశమని, దీంట్లో విభిన్న కోణాలంటాయని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పాలసీలను రూపొందిస్తాయని చెప్పారు.
కేంద్రం అవలంబిస్తున్న విధానాలు రాష్ర్టాలకు తీరని నష్టాలను మిగుల్చుతున్నాయని, కుంటిసాకులు చూపుతూ డిస్కంలను నిందించడం తగదన్నారు. మనకు విస్తారమైన బొగ్గుగనులు ఉన్నప్పటికీ.. ఇక్కడి వనరులను వినియోగించుకోకుండా ప్రైవేట్ సంస్థల నుంచి వేలకు వేలు పెట్టి కొనుగోలు చేయాలనడం విడ్డూరమని పేర్కొన్నారు. విదేశీ బొగ్గును కొనుగోలుచేయాలని కేంద్రం బలవంతం చేస్తున్నదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి విద్యుత్ అత్యవసరమని, పవర్ లేనిదే ఏమీ చేయలేరని, విద్యుత్తు ఎంత అవసరమో.. సంస్థలకు ఆర్థిక వనరులు సైతం అంతే అవసరమని తెలిపారు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రైవేట్ కంపెనీలు టన్ను బొగ్గు కోసం వేలకు వేలు వసూలు చేస్తున్నాయని ప్రభాకర్రావు చెప్పారు.
దేశంలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు సహా, బొగ్గు సంక్షోభంపై విచారణ జరిపించాలని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ పీ రత్నాకర్రావు కోరారు. కేంద్రం విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, నిర్దిష్టమైన బిడ్డింగ్, డాక్యుమెంట్లు లేకుండా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రైవేటీకరణకు పూనుకోవడం అత్యంత దారుణమని చెప్పారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం తక్షణమే విరమించుకోవాలని కోరారు. రాష్ట్రంలో స్మార్ట్మీటర్లను పెట్టడాన్ని నిలిపివేయాలని, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని, పుదుచ్చేరిలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, విద్యుత్ సరవణ బిల్లును రద్దుచేయాలని రత్నాకర్రావు డిమాండ్చేశారు.
rao comments