హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశానికి అనేక విభాగాల్లో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పట్టణాలు ఆర్థిక క్రమశిక్షణ విభాగంలోనూ ర్యాంకులు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే పటిష్ఠ ప్రణాళికను రూపొందించింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేందుకు కేంద్రం దేశంలోని పట్టణాలను నాలుగు క్యాటగిరీలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి, లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్నవి, 10-40 లక్షల జనాభా ఉన్నవి, 40 లక్షలకుపైగా జనాభా ఉన్నవి)గా విభజించి సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహిస్తున్నది. ప్రతి క్యాటగిరీలో టాప్-3 పట్టణాలకు జాతీయ స్థాయి అవార్డులను అందిస్తున్నది. ఈ ఏడాది పోటీల్లో పాల్గొనే పట్టణాలు మే 31లోగా తమ వివరాలను పొందుపర్చాలని, ర్యాంకులు సాధించిన పట్టణాల జాబితాను జూలై 2023లో ప్రకటిస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు పట్టణాలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది తెలంగాణ నుంచి అత్యధిక పట్టణాలు ఈ పోటీల్లో పాల్గొనేలా మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.