హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పిల్లలకు వేసవి కాలం సెలవులు.. ఓ రెండు, మూడు రోజులు ఏక్కడికైనా వెళ్లొస్తే బాగుండు అనుకునే వారికి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) మంచి ఆఫర్ ఇస్తున్నది. ఎక్కడికి వెళ్లాలో మీరు ప్లాన్ చేసుకుంటే చాలు.. పర్యాటకశాఖ వెహికిల్స్ అరేంజ్ చేయడంతో పాటు వసతి, భోజన సదుపాయాలను చూసుకుంటుంది. పదిహేను మంది ఉంటే చాలు పర్యాటకశాఖ వాహనం పంపించేందుకు సిద్ధంగా ఉన్నది. ఫ్యామిలీ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ వాసులు, గేటెడ్ కమ్యూనిటీ బృందాలు టూర్కు వెళ్లాలనుకుంటే బస్సులను పంపించనున్నది. ఇవే కాకుండా వేసవికే ప్రత్యేకంగా ఊటీ, అరకు ప్యాకేజీలను నిర్వహిస్తున్నది. ఇవి కాకుండా తిరుపతి, షిర్డీ, యాదాద్రి లాంటి ఆధ్యాత్మిక పాకేజీలను ఎప్పటిలాగే కొనసాగిస్తున్నామని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.
ఊటీ టు హైదరాబాద్
మొత్తం ఆరురోజులు ఈ టూర్ ఉంటుంది. తొలిరోజు బషీర్బాగ్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక బుల్ టెంపుల్, లాల్బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, విధాన్ సౌధ, కబ్బన్ పార్క్ సందర్శన ఉంటుంది. రాత్రి అక్కడే బస చేశాక మూడోరోజు ఉదయం 4 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఊటీకి చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి బొటానికల్ గార్డెన్, బోటింగ్, స్థానిక ప్రాంతాల సందర్శన ఉంటుంది. రాత్రి అక్కడే బస ఏర్పాటు చేస్తారు. నాలుగోరోజు ఉదయం 9 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు మైసూర్ చేరుకుంటారు. అక్కడ బృందావన్ గార్డెన్ను సందర్శించి రాత్రి విడిది చేశాక మరుసటి రోజు ఉదయం 7 గంటల నుంచి చాముండేశ్వరి టెంపుల్, మైసూర్ మహారాజ ప్యాలెస్, బిగ్బుల్ టెంపుల్ చూసుకొని మధ్యాహ్నం 12 గంటలకు తిరుగుప్రయాణం అవుతారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. పెద్దలకు రూ. 9900, పిల్లలు 7,920 చెల్లించాల్సి ఉంటుంది. నాన్ఏసీ, ఏసీ అకామడేషన్ అనుసరించి చార్జీల్లో మార్పు ఉంటుంది.
అరకు టు హైదరాబాద్
ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి అరకుకు పర్యాటక శాఖ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇది ఐదు రోజుల టూర్. గురువారం సాయంత్రం 6 గంటలకు పర్యాటక భవన్ లేదా బషీర్బాగ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడ కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం, వైజాగ్ బీచ్ సందర్శించాక హోటల్లో బస ఏర్పాటు చేస్తారు. మూడోరోజు ఉదయం 6 గంటలకు అక్కడి నుంచి అరకు తీసుకెళ్లి ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, బొర్రాగుహలు, ధింసా డ్యాన్స్ చూపిస్తారు. మరునాడు ఉదయం అరకు నుంచి బయల్దేరి అన్నవరం ఆలయాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమైన ఐదోరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. పెద్దలకు రూ.6999, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.5,599 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు టీఎస్టీడీసీ వైబ్సైట్ను సందర్శించి బుకింగ్స్ చేసుకోవచ్చు.
తక్కువ చార్జీలు తీసుకుంటున్నాం
డీజిల్ ధరలు పెరిగినా పర్యాటకులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్యాకేజీలకు అతితక్కువ చార్జీలు తీసుకుంటున్నాం. వాహనాలను పంపించినా కూడా తక్కువ చార్జే ఉంటుంది. వేసవి వెకేషన్కు వెళ్లాలనుకునే వారికి టీఎస్టీడీసీ మంచి ఆప్షన్. రెండు, మూడు రోజుల టూర్ ఏదైనా మా వెహికిల్స్ పంపిస్తాం.
– ఉప్పల శ్రీనివాస్గుప్తా, టీఎస్టీడీసీ