హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 26,321 ఆర్థిక నేరాల కేసులు నమోదవగా.. 2023లో వాటి సంఖ్య స్వల్పంగా పెరిగి 26,881కు చేరింది. కానీ, 2024లో రోజుకు సగటున 108 చొప్పున ఏకంగా 39,127 కేసులు నమోదయ్యాయి. ఇది జాతీయ సగటు 15.3% కంటే చాలా రెట్లు ఎకువ. వీటిలో సరైన ఆధారాలు లేని కేసులు 19,207 ఉన్నాయి. మొత్తం కేసుల్లో పోలీసులు చార్జిషీట్లు వేసినవి 39.8 శాతమే. 39,127 కేసుల్లో పోలీసులు 9,542 మందిని మాత్రమే అరెస్టు చేశారు. వారిలో 8,608 మంది పురుషులు, 934 మంది మహిళలు ఉన్నారు. అరెస్టు అయినవారిలో 2,134 మంది పురుషులకు, 112 మంది మహిళలకు శిక్షలు పడ్డాయి. 2023 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మొత్తం 60,038 ఆర్థిక నేరాల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
రూ.1 లక్షలోపు ఆర్థిక నేరాలే ఎక్కువ
తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక నేరాల్లో రూ.లక్షలోపు నేరాలే అధికంగా ఉంటున్నాయని, ఇలాంటి నేరాలకు సంబంధించి 2024లో రాష్ట్రవ్యాప్తంగా 13,294 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది. రూ.1-10 లక్షలలోపు మోసాలకు పాల్పడినవారిపై 12,245 కేసులు, రూ.10-50 లక్షల మోసాలకు పాల్పడినవారిపై 1,248 కేసులు, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటిలోపు మోసాలకు పాల్పడినవారిపై 749 కేసులు, రూ.కోటి నుంచి రూ.10 కోట్లలోపు మోసాలలకు పాల్పడినవారిపై 170 కేసులు, రూ.10 కోట్ల నుంచి 25 కోట్లలోపు మోసాలకు పాల్పడినవారిపై 41 కేసులు, రూ.25 కోట్ల నుంచి 50 కోట్లలోపు మోసాలకు పాల్పడినవారిపై 3 కేసులు, రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లలోపు మోసాలకు పాల్పడినవారిపై 2 కేసులు నమోదైనట్టు తెలిపింది.
ఆస్తి మోసాలూ అధికమే
తెలంగాణలో ఆస్తులకు సంబంధించిన మోసాలు కూడా భారీగానే జరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2024లో రోజుకు సగటున 107 చొప్పున 38,908 ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ కేసులతోపాటు 801 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులు, బ్యాంకులను మోసగించడంపై 1,797 కేసులు, ఏటీఎంల వద్ద అమాయకులను మోసగించినవారిపై 968 కేసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరుతో మోసగించినవారిపై 2,739 కేసులు నమోదైనట్టు తెలిపింది.
